హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసుకు హాజరైన ఏపీ మంత్రి అమర్నాథ్... విలేకరుల ప్రశ్నకు ఆసక్తికర జవాబు

  • హైదరాబాదులో ఎలక్ట్రిక్ కార్ రేసింగ్
  • గ్యాలరీ నుంచి వీక్షించిన ఏపీ మంత్రి
  • తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ
హైదరాబాదులో నిర్వహించిన ఫార్ములా-ఈ గ్రాండ్ ప్రీ కార్ రేసింగ్ కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా హాజరయ్యారు. ప్రతిష్ఠాత్మక రీతిలో నిర్వహించిన ఈ ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్ ను ఆయన గ్యాలరీ నుంచి తిలకించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కూడా అమర్నాథ్ కలిశారు. 

రేసుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్ తో హైదరాబాదుకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, గర్వకారణంగా భావిస్తున్నామని తెలిపారు. తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. ఫార్ములా రేస్ ను నిర్వహించే దిశగా ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖను హైదరాబాద్ నగరంలా అభివృద్ధి చేస్తామని అమర్నాథ్ అన్నారు.

ఇక విలేకరులు ఆయనను ఏపీలో కూడా ఫార్ములా-ఈ రేస్ నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు అమర్నాథ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. "ఒక కోడి... గుడ్డును మాత్రమే పెట్టగలదు... కోడిని పెట్టలేదు కదా! ఒక కోడి పుట్టాలంటే చాలా సమయం పడుతుంది. గుడ్డు పెట్టాలి... ఆ గుడ్డు పొదగాలి... అప్పుడు కోడిపిల్ల పుడుతుంది... ఆ కోడి పిల్ల పెరిగి పెద్దదవ్వాలంటే సమయం పడుతుంది. ఇప్పుడు ఏపీలో కోడి గుడ్డు పెట్టింది... అది కోడిపెట్టగా మారడానికి సమయం పడుతుంది" అని వివరణ ఇచ్చారు.
.

Gudivada Amarnath
Formula-E
Car Race
KTR
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News